న్యూయార్క్: అమెరికా అధ్యక్షులకు తాము తీసుకున్న నిర్ణయాల పట్ల పూర్తి రక్షణ ఉంటుందని ఆ దేశ సుప్రీంకోర్టు వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై నమోదు అయిన కేసుల్లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో కోర్టు విచారణ చేపట్టింది. ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో సుప్రీం తన తీర్పును వెలువరించింది.
అధ్యక్షుడి హోదాలో తీసుకున్న నిర్ణయాలకు.. రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉంటుందని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో 6-3 తేడాతో ధర్మాసనం తీర్పునిచ్చింది. అధికారిక చర్యలకు రక్షణ ఉంటుందని, కానీ అనధికార చర్యలకు ఇమ్యూనిటీ ఉండదని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ చాలా వరకు తీర్పును రాశారు. జనవరి ఆరో తేదీన అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్ల అంశంలో తాజా తీర్పుతో ఆయనకు రక్షణ ఏర్పడింది.
రాజ్యాంగ అధికారాలను నిర్వర్తిస్తున్న అధ్యక్షుడిని ప్రాసిక్యూట్ చేయలేమని సుప్రీం తెలిపింది. అలాంటి అధ్యక్షులకు అధికారిక చర్యల నుంచి రక్షణ ఉంటుందని కోర్టు చెప్పింది. దీంతో రాబోయే నవంబర్ ఎన్నికలకు వరకు ట్రంప్కు కోర్టు కేసుల నుంచి రక్షణ దొరికినట్లు అయ్యింది.