United Kingdom : యునైటెడ్ కింగ్డమ్ (UK) లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్కాట్లాండ్ (Scotland), వేల్స్ (Wales), నార్తర్న్ ఐర్లాండ్ (Northern Irland) లలోని ప్రధాన జాతీయవాద పార్టీల నేతలు ఒక్కతాటిపైకి వచ్చారు. తమ దేశాలకు స్వయం నిర్ణయాధికారం ఉందని స్పష్టంచేస్తూ ఒక చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. రాజ్యాంగపరమైన మార్పులకు బ్రిటిష్ ప్రభుత్వం (Britain Govt) సిద్ధం కావాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ పరిణామం యూకే రాజకీయాల్లో (UK politics) తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిన్న కార్డిఫ్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్, ఎస్ఎన్పీ నేత జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్, ప్లాయిడ్ కమ్రీ పార్టీ అధినేత రూన్ ఆప్ ఇయర్వర్త్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్, సిన్ ఫెయిన్ పార్టీకి చెందిన మిషెల్ ఓ ‘నీల్ ఈ ‘మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (MoU)’ పై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో సిన్ ఫెయిన్ పార్టీ అధ్యక్షురాలు మేరీ లౌ మెక్డొనాల్డ్ కూడా పాల్గొన్నారు.
యూకే వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మారుతోందని, తమ దేశాల భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు తమ ప్రజలకు ఉందని ఈ ఒప్పందంలో వారు స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే హక్కు ఏ వెస్ట్మిన్స్టర్ (బ్రిటిష్) ప్రభుత్వానికీ లేదని, వెస్ట్మిన్స్టర్ పాలనకు కాలం చెల్లిందని ఈ ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు. యూకేలోని మూడు దేశాల్లోనూ స్వాతంత్ర్యం కోరుకునే ఫస్ట్ మినిస్టర్లు ఏకకాలంలో అధికారంలో ఉండటం ఇదే మొదటిసారని వారు గుర్తుచేశారు.
ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవాలని, తమ దేశాల భవిష్యత్తు యూరోపియన్ యూనియన్తోనే ముడిపడి ఉందని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ కూటమిలోని పార్టీలకు వేర్వేరు లక్ష్యాలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. స్కాట్లాండ్ స్వాతంత్ర్యం కోసం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని స్కాటిష్ నేషనల్ పార్టీ కోరుతోంది. 2014లో జరిగిన రిఫరెండంలో 45% ప్రజలు యూకేకు వ్యతిరేకంగా, 55% మంది యూకేలోనే కొనసాగేందుకు మొగ్గు చూపారు. దాంతో రెఫరెండం వీగిపోయింది.
ఇక నార్తర్న్ ఐర్లాండ్ను రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తో విలీనం చేయాలని ‘గుడ్ ఫ్రైడే ఒప్పందం’ కింద సిన్ ఫెయిన్ పార్టీ పోరాడుతోంది. వేల్స్ స్వాతంత్ర్యానికి ప్లాయిడ్ కమ్రీ పార్టీ మద్దతిస్తున్నా, రిఫరెండం కోసం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించలేదు. కాగా ఈ మూడు చేశాల చారిత్రక ఒప్పందానికి బ్రిటిష్ ప్రధాని ఆండీ బర్న్హామ్ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. యునైటెడ్ కింగ్డమ్ ఐక్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించడంపైనే దృష్టి సారించామని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఈ ఒప్పందంలో మిషెల్ ఓ’నీల్ పాల్గొనడాన్ని నార్తర్న్ ఐర్లాండ్లోని డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ వంటివి విమర్శించాయి. ఇదిలావుంటే ఈ ఒప్పందానికి తక్షణ చట్టపరమైన బలం లేనప్పటికీ, యూకేలో రాజ్యాంగపరమైన సమస్యలను సజీవంగా ఉంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.