జకర్తా, జూలై 3: అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన 36 ఏండ్ల మహిళ విగతజీవిగా ఒక కొండ చిలువ కడుపులో కన్పించిన ఘటన సెంట్రల్ ఇండోనేషియాలో చోటు చేసుకుంది. దక్షిణ సల్వేసి ప్రావిన్స్లోని సిటేబా గ్రామంలో నివసించే సిరియాటి అనే మహిళ తన కుమారుడికి మందులు కొనడానికి మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి కన్పించకుండా పోయింది. బంధువులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించ లేదు.
అయితే ఇంటికి 500 మీటర్ల దూరంలోని ఒక గ్రౌండ్లో ఆమె ప్యాంట్, చెప్పులు ఆమె భర్తకు లభించాయి. దానికి పది మీటర్ల దూరంలో ఒక పెద్ద కొండచిలువ కదలకుండా పడి ఉంది. అయితే అది బతికే ఉండటమే కాక, దాన పొట్ట బాగా ఉబ్బి కన్పించడంతో అనుమానించి అతను గ్రామస్తులను పిలిచాడు. వారి సాయంతో దాని పొట్టను చీల్చగా సిరియాటి మృతదేహం బయటపడింది. నెల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అలాగే గత ఏడాది పొలంలో పనిచేస్తున్న ఒక రైతును నాలుగు అడుగుల కొండచిలువ అమాంతం మింగేసింది.