సిడ్నీ: విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ భారం మోపింది. విదేశీ విద్యార్థుల వీసా ఫీజును దాదాపు రెట్టింపు చేసింది. ఇంతకుముందు వీసా ఫీజు 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండగా, దాన్ని 1,600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచింది. అంతేకాదు.. విజిటర్ వీసా, తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాతో ఆ దేశంలో ఉన్నవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం విధించింది. ‘రికార్డు స్థాయిలో నమోదవుతున్న విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ విదేశీ విద్యార్థులకు వసతి దొరకడం కష్టంగా మారింది. మా అంతర్జాతీయ విద్యావ్యవస్థ సమగ్రతను పరిరక్షించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చాం.
స్వేచ్ఛగా, ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం’ అని ఆ దేశ హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తెలిపారు. అమెరికా, కెనడా వీసా ఫీజును పెంచటంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నారు. 2022-23లో 1.50 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియాకు వచ్చారు. దీంతో ముందుగా ఇంగ్లిష్ భాషపై కఠిన నిబంధనలు అమలుచేయగా, పొదుపును 24,505 ఆస్ట్రేలియా డాలర్ల నుంచి 29,710 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచింది.
ఇప్పుడు వీసా ఫీజును డబుల్ చేసింది. వీసా నిబంధనలపై ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ సీఈవో లూక్ షీయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది మా ఆర్థిక వ్యవస్థకు, మా యూనివర్సిటీలకు మంచిది కాదు. మా ఆర్థిక వ్యవస్థ, మా యూనివర్సిటీలు పూర్తిగా విదేశీ విద్యార్థుల ఫీజుపైనే ఆధార పడి ఉన్నాయి’ అని తెలిపారు.