Syria borders | సిరియాలో విధ్వంసం సృష్టించిన భూకంపాల కారణంగా రెండు సరిహద్దులు తెరుచుకున్నాయి. దాదాపు 12 ఏండ్ల తర్వాత తుర్కియేతో ఉన్న సరిహద్దులను సిరియా ప్రభుత్వం తెరిచింది. ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు రెండు సరిహద్దులను తెరవాలని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ ఆస్సాద్ ప్రకటించగానే.. అధికారులు వేగంగా స్పందించి క్రాసింగ్స్ ప్రారంభించారు. ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియాలోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు.
సరిగ్గా వారం క్రితం తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం పెద్ద విలయాన్నే సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలను సిరియాకు పంపేందుకు సరిహద్దుల మూసివేత ఇబ్బందికరంగా తయారైంది. దాంతో ఐరాస సూచన మేరకు సిరియా ప్రభుత్వం తుర్కియేతో ఉన్న రెండు సరిహద్దు క్రాసింగ్లను ప్రారంభించింది. ఈ సరిహద్దుల ద్వారా ఐరాస సిరియాకు సహాయక సామగ్రిని పంపేందుకు వీలుకలుగుతున్నది. దేశ ప్రజలు సాయం పొందేందుకు ఈ సరిహద్దులు రానున్న 3 నెలల పాటు తెరిచి ఉంచనున్నారు.
వాయవ్య సిరియాలో బాధిత ప్రజలను ఆదుకోవడంలో ప్రపంచం మొత్తం విఫలమైందని ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నది. ఐరాస ప్రకారం, సిరియాలో 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు దేశాల్లోని దాదాపు 9 లక్షల మందికి సరైన ఆహారం అందాల్సి ఉన్నది. సిరియా సరిహద్దులో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం పూర్తయిన చాలా దేశాల ప్రతినిధులు వారివారి దేశాలకు వెళ్లిపోతున్నాయి. భద్రతా కారణాలను పేర్కొంటూ హట్టాలాలోని తమ టీమ్ను ఇజ్రాయెల్ వెనక్కి పిలిచింది. అంతకు ముందు జర్మనీ, ఆస్ట్రియా బృందాలు కూడా తమ రెస్క్యూ సిబ్బందిని తుర్కియే నుంచి ఉపసంహరించుకున్నాయి.