Suicide attacks : ఈశాన్య నైజీరియాలో ఘోరం జరిగింది. ఆత్మాహుతి దాడుల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని బోర్నో స్టేట్లో శనివారం మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. గ్వోజా పట్టణంలోని ఓ ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి జరిగింది. అదేవిధంగా ఓ పెళ్లిలో ఇద్దరు మహిళలు బాంబులు కట్టుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
పెళ్లిలో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇలా మొత్తం మూడు ఆత్మాహుతి దాడుల్లో కలిపి 18 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు, గర్భిణీలు ఉన్నారు.
గ్వోజాలోని సెక్యూరిటీ చెక్ పోస్టు దగ్గర మరో దాడి జరిగింది. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలోని గ్వోజాను బోకోహరం తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా భద్రతా బలగాలు 2015లో గ్వోజాను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి బోకోహరం తీవ్రవాదులు గ్వోజాపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఈ దాడుల్లో 40 వేల మంది చనిపోగా, 20 లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు.