లండన్: బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఎగ్జిట్పోల్స్ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) భారీ ఓటమి తప్పేలా లేదు. కీర్ స్టార్మర్ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీ 253 సీట్లలో విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ గెలుపొందారు. ఇక అధ్యక్షుడు రిషి సునాక్ (Rishi Sunak) పార్టీ 44 స్థానాలకే పరిమితమైంది. కాగా, ముందస్తు అంచనాలు లేబర్పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.
బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో అది 67 శాతంగా ఉన్నది. కాగా, భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దూరపు బంధువు ఉదయ్ నాగరాజు, బ్రిటన్ ఎంపీ ఎన్నికల్లో నిలబడ్డారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్లో స్థిరపడ్డారు. ఆయన లేబర్ పార్టీ తరఫున ఉత్తర బెడ్ఫోర్డ్షైర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 45 ఏండ్ల ఉదయ్ నాగరాజ్ తన గెలుపుపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.