ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని కరాచీలో ఆకస్మికంగా అనేక మంది మరణించారు.(Mysterious Deaths) ఇప్పటి వరకు మృతుల సంఖ్య 22కు చేరింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఆ నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. కరాచీలో ప్రస్తుతం అయోమయం నెలకొన్నది. మిస్టీరియస్ డెత్లపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మంగళవారం కొత్తగా ఐదు మృతదేహాలను గుర్తించారు. దీంతో కరాచీలో ఇప్పటి వరకు మిస్టీరియస్గా మరణించిన వారి సంఖ్య 22కు పెరిగింది.
కాగా, అధికారులు, సంక్షేమ సంస్థ చిపా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ చనిపోయిన 22 మంది ఎవరన్నది గుర్తించలేకపోయారు. మంగళవారం కనుగొన్న ఐదుగురు మృతుల్లో ముగ్గురు డ్రగ్స్కు బానిసలుగా తెలుస్తున్నదని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. బంధువులెవరూ స్వీకరించడానికి రాకపోవడంతో సుమారు 22 మంది మృతదేహాలను గుర్తించలేకపోయినట్లు చెప్పారు.
మరోవైపు కరాచీలో ఎండలు మండిపోవడంతో చాలా మంది వడ దెబ్బ వల్ల మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. హీట్స్ట్రోక్ కారణంగా పలు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగిందన్నారు.
కాగా, మరణించిన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్కు బానిసలుగా తెలుస్తున్నదని కరాచీలోని మరో మానవతా సహాయ సంస్థ ఈధి ఫౌండేషన్కు చెందిన అజీమ్ ఖాన్ తెలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు తీవ్రమైన వేడిమి వల్ల మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.
మరోవైపు కరాచీలోని ఒక ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఇంటి బయట బహిరంగంగా డ్రగ్స్ సేవించడాన్ని అడ్డుకునేందుకు ఒక వృద్ధుడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులు ఆ వృద్ధుడ్ని దారుణంగా కొట్టారు. కరాచీతోపాటు పాకిస్థాన్లో విచ్చల విడిగా డ్రగ్స్ వినియోగానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.