Diabetes | సిడ్నీ: రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం వల్ల టైప్ 2 మధుమేహ ముప్పు 67 శాతం పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 84,700 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఇందుకోసం 2013 నుంచి 2016 మధ్యకాలంలో ఒక్కొక్కరికి వారం రోజుల పాటు చేతులకు లైట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. తొమ్మిదేండ్ల తర్వాత ఈ డాటాను విశ్లేషించగా ఎక్కువగా రాత్రిపూట వెలుగులో ఉన్న వారిలో మధుమేహ ముప్పు 67 శాతం పెరిగిందని గుర్తించారు. రాత్రి పూట ఎంత ఎక్కువ సేపు వెలుగులో ఉంటే అంత ఎక్కువగా ఈ ముప్పు పెరుగుతున్నట్టు తేల్చారు.
రాత్రిపూట ఎక్కువగా వెలుగును చూడటం, వెలుతురులో గడపడం వల్ల మనిషిలో మానసిక, శారీరక మార్పులు వస్తాయని, 24 గంటల చక్రం దెబ్బతింటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది గ్లూకోజ్ మెటాబాలిజంలోనూ మార్పులకు కారణమవుతుందని తెలిపారు. తద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించుకునే శక్తి తగ్గిపోతుందని, మధుమేహం మొదలవడానికి దారి తీస్తుందని పరిశోధకుడు అండ్రూ ఫిలిప్స్ తెలిపారు. రాత్రిపూట స్క్రీన్లు చూడటం, రోజూ ఒకే సమయానికి నిద్ర పోకపోవడం వంటివి మధుమేహ ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు.