లండన్, జూలై 4: బ్రిటన్లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం, లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ నుంచి ప్రధాని రిషి సునాక్ (అధికార కన్జర్వేటివ్ పార్టీ) గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రిషి సునాక్, కన్జర్వేటివ్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నది. గత 14 ఏండ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉండటం, సునాక్కు సవాల్గా మారింది. పోల్ సర్వేలు లేబర్ పార్టీ గెలుపు ఖాయమంటూ అంచనావేస్తున్నాయి. సునాక్(44), ఆయన భార్య అక్షతా మూర్తి ఉత్తర ఇంగ్లాండ్లోని యార్క్షైర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోటీలో పీవీ బంధువు
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దూరపు బంధువు ఉదయ్ నాగరాజు, బ్రిటన్ ఎంపీ ఎన్నికల్లో నిలబడ్డారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్లో స్థిరపడ్డారు. ఆయన లేబర్ పార్టీ తరఫున ఉత్తర బెడ్ఫోర్డ్షైర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 45 ఏండ్ల ఉదయ్ నాగరాజ్ తన గెలుపుపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.