నైరోబీ: పన్నులు పెంచుతూ కెన్యాలో పాలకులు తీసుకొచ్చిన ప్రతిపాదిత ఫైనాన్స్ బిల్లు (2024-25) ఆ దేశాన్ని కుదిపేస్తున్నది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి.
రాజధాని నైరోబీ సహా దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు హోరెత్తాయి. పన్ను పెంపు బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని తెలియగానే, ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఏకంగా పార్లమెంట్ భవనానికే నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు.
కాల్పుల్లో కనీసం 10 మంది నిరసకారులు చనిపోయినట్టు తెలిసింది. పార్లమెంట్ వద్ద నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. నిరసనకారులు తొలుత పార్లమెంట్ ప్రాంగణాన్ని ముట్టడించే యత్నం చేయగా, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లు, టియర్గ్యాస్లను ప్రయోగించారు. గుంపును చెదరగొట్టే ప్రయత్నాలు విఫలం కావటంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు ప్రకటించారు.