Iran | ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనిమా (Ismail Haniya), లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ సుక్రు హత్యలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం ఉంది. తమ సొంత గడ్డపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను హత్య చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్పై నేరుగా దాడి చేయండి అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అయితే, ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా (Hezbollah) సోమవారం నుంచే దాడులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తాజాగా వెల్లడించింది. ఈ దాడుల అంశంపై తమకు సమాచారం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా తెలిపారు. ఈ మేరకు జీ7 దేశాల మంత్రులను హెచ్చరించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఎలా, ఏ సమయంలో ఈ దాడులు ఉండొచ్చనేది మాత్రం కచ్చితంగా తెలియదని ఆంటోనీ బ్లింకెన్ జీ7 దేశాల నేతలకు చెప్పినట్లు పేర్కొంది.
అమెరికా అప్రమత్తం..
ఉద్రిక్తతల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్లోని తమ సిబ్బంది, ఇజ్రాయెల్ను కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచినట్టు అమెరికా తెలిపింది. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. జోర్డాన్ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్లు తెలిపింది. మరోవైపు లెబనాన్ను వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. అదేవిధంగా లెబనాన్ను వెంటనే వీడాలని భారత్తోపాటు జోర్డాన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీచేశాయి.
మరోవైపు.. ఇరాన్ మద్దతు గల లెబనాన్ కేంద్రంగా నడిచే హెజ్బొల్లా గ్రూపు శనివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్ వ్యవస్థ అడ్డుకొన్నదని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా, రాకెట్ దాడుల్లో మోషవ్ బీట్ హిల్లేల్లో పలువురు పౌరులు గాయపడినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్ ఒకరు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్ నగరం బజౌరీహ్పై జరిపిన క్షిపణి దాడిలో కీలక హెజ్బొల్లా నేత అలీ అబ్ద్ హతమయ్యాడని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది.
Also Read..
Israel-Hamas War | యుద్ధం అంచున గల్ఫ్.. విస్తృతమవుతున్న ఇజ్రాయెల్- హమాస్ వార్!
Climate Change | వాతావరణ మార్పులు.. 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అంతం!
Britain | బ్రిటన్లో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు