Joe Biden | వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున తానే అభ్యర్థినని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నేనే పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోమంటూ నాపై ఎలాంటి ఒత్తడి లేదు’ అని ఆయన పేర్కొన్నారు.ఇటీవల ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడ్డారని, ట్రంప్ వాదనకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయారని, దాంతో ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటారంటూ మీడియా, పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ ఊహాగానాలకు తెరదించారు. ‘నేనేమీ ఎన్నికలను వదిలి పోవడం లేదు. నన్నెవరూ బయటకు పంపడం లేదు. మేమే ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.
పాక్లో లీటరు పాలు రూ.370
ఇస్లామాబాద్: కొత్త పన్ను కారణంగా పాకిస్థాన్లో పాల ధర ఐదింతలు పెరిగింది. పాల ఉత్పత్తుల ధరలు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువకు చేరాయి. ప్రస్తుతం కరాచీలోని సూపర్ మార్కెట్లలో ఒక లీటర్ హెచ్ఎంటీ పాల ధర రూ.370 (1.33 డాలర్లు)గా ఉంది. ఇవే పాలను ఆమ్స్టర్డామ్లో 1.29 డాలర్లు, పారిస్లో 1.23 డాలర్లకు అమ్ముతున్నారని బ్లూబెర్గ్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనల మేరకు పన్ను మినహాయింపు గల పాలపై 18 శాతం పన్ను విధించారు. పాల ధర పెంపు వల్ల పిల్లల్లో పోషకార లోపం పెరుగుతుందని ముహమ్మద్ నసీర్ అనే డైరీ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్లో ఐదేండ్ల లోపు చిన్నారుల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.