Hezbollah | బీరూట్, జూలై 4: ఇజ్రాయెల్పై లెబనాన్ తీవ్రవాద దళం హెజ్బొల్లా విరుచుకుపడింది. సుమారు 200 రాకెట్లను ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రతినిధులు తెలిపారు. భారీ వార్హెడ్లను అమర్చిన కత్యుషా రాకెట్లు, ఫలాక్ రాకెట్లతో పాటు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ఉత్తర ఇజ్రాయెల్తో పాటు ఆక్రమిత సిరియ్ గోలన్ హైట్స్పైకి ప్రయోగించినట్టు వెల్లడించారు.
తమ సీనియర్ కమాండర్లను చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు వారు చెప్పారు. దాడిని ఇజ్రాయెల్ మిలిటరీ నిర్ధారించింది. లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో గత నెల రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గురువారం ఈ దాడికి పూనుకుంది. కాగా, లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద జరుగుతున్న పరస్పర దాడులతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ ఉన్న అడవులు, వ్యవసాయ భూములకు అవి వ్యాపిస్తున్నాయి.