కాలిఫోర్నియా: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) భూమికి తిరిగిరావడం మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 5న పది రోజుల మిషన్ భాగంగా మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వారిద్దరు భూమికి తిరిగి రావాల్సి ఉన్నది. అయితే బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్ 26న వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. అయితే వారిద్దరు భూమిపైకి ఎప్పుడు వస్తారనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ను రూపొందించింది. ఆ వ్యోమనౌకకు ఇదే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర. ఐఎస్ఎస్కు వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో లోపం తలెత్తి పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. పలుమార్లు వాయిదా పడిన తర్వాత జూన్ 5న వారిని అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు. అయితే వారిద్దరు తిరిగి రావడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్తో పాటు నాసా గుర్తించాయి. దీంతో స్టార్లైనర్లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.
ఈనేపథ్యంలో టెస్లాచీఫ్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్లో సునీతను వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ భూమికి తిరిగివచ్చేందుకు అంతరిక్షంలో రెడీగా ఉంది. ఇందులో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమి మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉన్నది. అనుకున్న సమయానికి స్టార్లైనర్ మరమ్మతులు పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్లోనే సునీత తిరిగి వచ్చే అవకాశం ఉన్నది.