లా పాజ్: బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. (Coup Attempt) అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్టు చేశారు. బుధవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం, కాంగ్రెస్కు నిలయమైన సెంట్రల్ ప్లాజా స్క్వేర్లోకి సైనిక దళాలు చొచ్చుకెళ్లాయి. అధ్యక్ష భవనం తలుపును ఆర్మీ వాహనం ఢీకొట్టింది. అనంతరం సైనికులు లోపలకు దూసుకెళ్లారు.
కాగా, బొలీవియా అధ్యక్షుడు ఆర్స్, సైనిక తిరుగుబాటుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈరోజు దేశం తిరుగుబాటు ప్రయత్నాన్ని ఎదుర్కొంటోంది. నేడు మరోసారి బొలీవియాలో ప్రజాస్వామ్యం చిన్నబోయింది’ అని అధ్యక్ష కార్యాలయం నుంచి సందేశం పంపారు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా బొలీవియన్ ప్రజలు సంఘటితమై ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మరోవైపు మిలిటరీ కమాండర్గా జోస్ విల్సన్ శాంచెజ్తో అధ్యక్షుడు ఆర్స్ ప్రమాణం చేయించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. దీంతో సైనికులు తమ యూనిట్లకు తిరిగి వెళ్లాలని కొత్త ఆర్మీ కమాండర్ శాంచెజ్ ఆదేశించారు. సైనికులు రక్తం చిందించవద్దని ఆయన కోరారు.
చివరకు బుధవారం సాయంత్రం అధ్యక్షుడి భవనం ప్రాంతం నుంచి సైనికులు వెనుతిరిగారు. ఆ వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు బొలీవియాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా పేర్కొంది. ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.