బీజింగ్, జూన్ 25: చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకుని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది.
ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకు చాంగే-6 రిటర్న్ క్యాప్సూల్ ల్యాండ్ అయినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) వెల్లడించింది.
దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్ గత నెల 3న భూమి నుంచి బయల్దేరి జూన్ 2న చంద్రుని దక్షిణ ధృవంలోని అయిట్కిన్ (ఎస్పీఏ) బేసిన్లో దిగింది.