చిక్కడపల్లి, జూన్ 29: పేదలు నివసించే ప్రాంతాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ‘నగరీకరణ- ప్రభుత్వ విధానాలు- ప్రత్యామ్నాయాలు ’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అర్బన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రామికులు లేకుండా నగరాల అభివృద్ధి లేదని, శ్రామికులు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ మెట్రో రైల్పై సమీక్ష చేసిన సీఎం సామాన్యులకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ రైళ్లపై సమీక్షించాలని, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. నగరంలో మురికివాడల్లో సదుపాయాలు పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.