Cantonment | కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనానికి సంబంధించిన విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్ మంగళవారం వివిధ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీసీలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలన నుంచి నేటి వరకు కొనసాగుతున్న నేటి వరకు భారతదేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున కంటోన్మెంట్ ఏరియాలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిధర్ కోరారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతిని తెలిపిందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు. సివిల్ ఏరియాల తొలగింపు విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా పంచుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.