సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్యంలో ఈ విభాగం పనిచేయనున్నది. అయితే ఈవీడీఎం పరిధిలో ఉన్న అడ్వర్టయిజ్మెంట్, ట్రాన్స్పోర్టు శాఖలను జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తూ బుధవారం కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగాలకు అదనపు కమిషనర్లను నియమించగా, ప్రకటన విభాగం అదనపు కమిషనర్గా కె. సత్యనారాయణ, ట్రాన్స్పోర్టుకు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ (హెల్త్) బాధ్యతలు పంకజకు అప్పగించారు.