Double Bedroom Houses | సిటీబ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టును చేపట్టి.. దాదాపు 66వేల మందికిపైగా పేదలకు గృహాలను ఉచితంగా అందజేసింది. ఎంతో ఆశతో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి అడుగు పెట్టిన ఆ పేదలకు కష్టాలు వెంటాడుతున్నాయి. కేటాయించిన నిధులతో సకాలంలో మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేయాల్సిన కాంగ్రెస్ సర్కారు.. డబుల్ ఇండ్ల మౌలిక వసతుల కల్పనపై శీతకన్ను వేసింది. ఫలితంగా బాధితులంతా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.
కరెంట్, లిఫ్ట్, మంచినీరు ..ఇలా సమస్యలతో డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టగా, తాజాగా సోమవారం ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు అహ్మద్గూడ డబుల్ బెడ్రూం ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 మంది నిరసన చేపట్టారు.
మంచినీటి సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సంస్థ ఎండీ అశోక్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే అహ్మద్గూడలో కేవలం వాల్వ్ల నిర్మాణం పూర్తి చేస్తే నీటి కష్టాలు తొలగిపోతాయి.. కానీ రూ. 3 లక్షల వాల్వ్ల కోసం.. జీహెచ్ఎంసీ, జలమండలి మధ్య ఉన్న సమన్వయం లోపం వల్ల లబ్ధిదారులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
అహ్మద్గూడలో ఇండ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులుపడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తున్నది. ఇదే విషయమై జలమండలి ఎండీ ఆశోక్రెడ్డి, జీహెచ్ఎంసీ ప్రజావాణిలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించాం. వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.