ఉప్పల్, జూలై 2: అక్రమ నిర్మాణాలపై బల్దియా సిబ్బంది వ్యవహరిస్తున్న అలసత్వం పరాకాష్టకు చేరుకున్నది. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో టౌన్ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం మరోసారి మంగళవారం తేటతెల్లమైంది. ’అక్రమ నిర్మాణాలు ఉంటే నేనేం చేయాలి’ అంటూ ఓ టౌన్ప్లానింగ్ ఏసీపీ ఏకంగా ఎమ్మెల్యేకే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఇటీవల పలు కాలనీల్లో బడా వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేస్తున్నా టౌన్ప్లానింగ్ విభాగం మాత్రం పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నది. అదే సమయంలో నిరుపేదల ఇండ్లకు మాత్రం నోటీసులు జారీ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నది. ఈ వ్యవహారంపై అనేకమంది కాలనీ వాసులు వచ్చి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో.. టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై పలువురు కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ తీరుతోనే ఉప్పల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని కాలనీవాసులందరూ ముక్తకంఠంతో ఆరోపించారు. టౌన్ప్లానింగ్ విభాగంలో భారీగా అవినీతి పెరిగిపోయిందని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ, పేదలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏసీపీ వెంకటరమణను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.. ‘అక్రమ నిర్మాణాలు ఉంటే నేనేం చేయాలి. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతా’ అని వెంకటరమణ మితిమీరిన నిర్లక్ష్యంతో సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అనుమతులు లేకుండా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కమర్షియల్ నిర్మాణాలు చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదంటూ ఆగ్రహించారు. వీటికి తోడు నిబంధనలు లేని నిర్మాణాలు, వ్యాపార సంస్థలకు ఎందుకు ట్యాక్స్ వేయడం చేయడంలేదని డీసీని ప్రశ్నించారు.