సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత కీలకమైన విభాగాలుగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక (ప్లానింగ్) విభాగాల్లో సమూలంగా మార్పులు చేయనున్నట్లు తెలిసింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులను చేపట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్ విభాగంలోని ఉన్నతాధికారుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. అర్హత లేని వారికి అందలం కల్పించి, అర్హులను మాత్రం పనిలేని చోట నియమించడం వల్ల కొన్ని రోజులుగా అసంతృప్తి జ్వాల రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్గా ఉన్న అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి, ప్రస్తుతం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సీజీఎంగా ఉన్న అధికారిని చీఫ్ ఇంజినీర్గా నియమించనున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల మధ్య హోదాల పరంగా ఉన్న తారతమ్యాలతో ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సంస్థాగతంగా ఇంజినీరింగ్ విభాగం ఒకప్పటిలా ఉన్నట్లు ఒక్కతాటిపై లేదు. రెండు వర్గాలుగా మారడంతో ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేమని కొందరు ఉన్నతాధికారులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పూర్తి స్థాయి కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ రావడంతో ఒక్కో విభాగంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేపడుతున్నారు. బాధ్యతలు తీసుకున్న రెండో రోజే గంటల తరబడి ఇంజినీరింగ్ విభాగం పనితీరుపైనే ఎక్కువ దృష్టి సారించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్నతాధికారులకు ఎలాంటి పనులు లేకపోవడంతో దాన్ని హెచ్ఎండీఏలో విలీనం చేయడం ద్వారా ఇంజినీరింగ్ విభాగంలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏలో ప్లానింగ్ విభాగం అంటేనే అవినీతికి మారు పేరు అన్న ముద్ర ఉన్నది. అలాంటి విభాగంలోనూ మార్పు చేయనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. భవన నిర్మాణంతో పాటు లే అవుట్ల అనుమతుల విషయంలో ప్లానింగ్ విభాగంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అధికారుల చుట్టూ తిరిగి, చెయ్యి తడిపితే తప్ప..ఫైల్ ముందుకు కదలదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్లానింగ్ విభాగంలోనూ ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే శంకర్పల్లి జోన్లో పనిచేసే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. అందులో భాగంగా హెచ్ఎండీఏ కమిషనర్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపైనే ఎక్కువగా దృష్టి సారించి, ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగులతోనే చాలా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. ఒక రోజు రాత్రి 8 గంటల వరకు ప్లానింగ్ విభాగం అధికారులతోనే సమావేశం నిర్వహించిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు ప్లానింగ్ విభాగం కావడంతో దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అధికారుల్లో నెలకొన్న అసంతృప్తులను తొలగించి, సామర్థ్యం ఉన్న వారికి సముచిత స్థానాలు కల్పించే చర్యలు తీసుకోనున్నారు. గత ఆరునెలలుగా హెచ్ఎండీఏ పనితీరుపైనే సంస్థ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్న కొత్త కమిషనర్.. దాన్ని పోగొట్టే దిశగా సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.