సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నుంచి ఫస్టియర్, సెకండియర్కు కలిపి మొత్తం 1.71 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 233 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష సమయాని కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
మేడ్చల్, మార్చి14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1,18,935 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు ఉంటే 040-27118584 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి, మార్చి 14(నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా 182 పరీక్షా కేంద్రాల్లో.. మొత్తం 1,27,656 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, 71,773 మంది విద్యార్థులు మొదటి సంవత్సరానికి, కాగా 55,883 మంది విద్యార్థులు రెండో సంవత్సరానికి హాజరవుతున్నారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీములు పరీక్షల పకడ్బందీ నిర్వహణకు తోడ్పడనున్నాయి. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నం: 89781 58484ను ఏర్పాటు చేశాం.
సుల్తాన్బజార్, మార్చి 14: ఇంటర్మీడియట్ విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ ఏ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రాల వరకు తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కాగా విద్యార్థులు హాల్ టిక్కెట్, కన్సేషనల్ బస్పాస్లపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఆది, సెలవు రోజులు, పండుగ రోజుల్లో ఉచితం ప్రయాణ సౌకర్యాలు అనుమతించబడవని పేర్కొన్నారు. ఎక్స్ప్రెస్ బస్సులో కాంబినేషన్ టికెట్ అనుమతించడంతో పాటు కన్సేషనల్ బస్ పాస్ లేని పక్షంలో సాధారణ బస్సు చార్జీలు చెల్లించి ప్రయాణం చేయాలని సూచించారు.