సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): క్షేత్రస్థాయి పర్యటనలు లేవు. పారిశుధ్యం పడకేసింది. దోమలతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. వీధికుక్కలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టులేవీ లేవు. పాత ప్రాజెక్టుల పురోగతి తెలియదు. సమస్యలు తీర్చాల్సిన ప్రజావాణి మొక్కుబడిగా సాగి ఏ సమస్యా తీర్చకుండానే ముగుస్తున్నది. ఇలా జీహెచ్ఎంసీ పాలన అత్యంత మందకొడిగా సాగుతున్న నేపథ్యంలోనే ఆ శాఖకు మరో కొత్త ఇబ్బంది ఎదురైంది. నిన్నటి వరకు జీహెచ్ఎంసీలో ఓ విభాగంగా పనిచేసిన ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ ఆండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీ అండ్ డీఎం) పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు, విధులు ఖరారు చేసే కసరత్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలోబల్దియా పరిధిలోకి హైడ్రా వస్తుందా? రాదా? లేదా బల్దియాకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? అనే విషయమై తీవ్ర సందిగ్ధత నెలకొన్నది.
కోటిన్నరకు పైగా జనం నివాసం ఉంటున్న జీహెచ్ఎంసీ పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. బల్దియాలో అన్ని విభాగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే తప్ప పరిపాలన సవ్యంగా సాగదు. అయితే ఇప్పటివరకు బల్దియాలో ఈవీ అండ్ డీఎం ఒక విభాగంగా పనిచేసింది. పారిశుధ్య వాహనాల నిర్వహణ, అక్రమ నిర్మాణాలపై నిఘా, అడ్వైర్జెజ్మెంట్ ఫ్లెక్సీలు, హోర్డింగుల నిర్వహణ ఈవీఆండ్ డీఎం విభాగపు ముఖ్య బాధ్యతలుగా ఉండేవి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు పని చేసేది. బల్దియా కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ విధులు నిర్వర్తించేవారు. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు ఐపీఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఈ విభాగం ఏర్పాటుతో నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విపత్తులు సంభవించిన డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి అక్కడ సేవలు అందించేవి. ఇప్పటి వరకు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు విశ్వజిత్ కంపాటి, ప్రకాశ్రెడ్డి డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తించి తమ మార్కును చూపించారు. కానీ ఇటీవల హైడ్రా ఏర్పడిన తర్వాత ఆ విభాగానికి డైరెక్టర్ కాకుండా కమిషనర్ స్థాయి పోస్టును ఏర్పాటు చేశారు. హైడ్రా కమిషనర్గా డీఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పజెప్పారు. పాత పద్ధతిలో ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ అటు మేయర్కు ఇటు బల్దియా కమిషనర్కు రిపోర్ట్ చేసేవారు. కానీ నూతనంగా నియమితులైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరాసరి సీఎం రేవంత్ రెడ్డికే రిపోర్ట్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో జీహెచ్ఎంసీకి సమాంతరంగా హైడ్రాను ఏర్పాటు చేశారా అనే సందేహాలు నెలకొన్నాయి. అదే నిజమైతే అటు బల్దియా ఇటు హైడ్రా.. ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు, విధులు నిర్వర్తించాలనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు.. హైడ్రా కమిషనర్గా నియమితులైన రంగనాథ్ బాధ్యతలు స్వీకరించగానే తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. సాధారణంగా బల్దియా కమిషనర్ ఆదేశిస్తేనే ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ కూల్చివేతలకు ఉపక్రమించాలి. కానీ వారం రోజుల క్రితం లోటస్పాండ్ వద్ద పార్కు స్థలాన్ని కబ్జా చేశారని బల్దియాతో సంబంధం లేకుండా ఈవీడీఎం కమిషనరే స్వయంగా కూల్చి వేతలకు ఆదేశించారు. అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం ఏ మేరకు సఫలమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటి కంటే మించి కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులకు జవాబుదారీతనంగా ఏ కమిషనర్ ఉంటారు? అన్నది ప్రశ్నార్థకం. వీటన్నింటికీ తోడుగా ఈ నెల 6వ తేదీన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానున్నది. కౌన్సిల్ మీటింగ్లో ఎక్కువగా పారిశుధ్యం, అక్రమ నిర్మాణాలు, అడ్వరైజ్డ్మెంట్ పైనే సభ్యులు చర్చ సాగిస్తారు. ఈ అంశాలకు సంబంధించి ఈవీడీఎం పాత్ర ఎంతో కీలకం. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వస్తారా అనేది తేలాల్సి ఉంది. కాగా, గడిచిన కొన్ని రోజులుగా ఈవీడీఎం కార్యకలాపాలు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. అయితే వర్షాకాలం ముంగిట ‘హైడ్రా’ అంశం రావడం, ఈవీడీఎం కార్యకలాపాలైన బల్దియాకు ఆదాయాన్ని సమకూర్చే అడ్వరైజ్డ్మెంట్, ట్రాన్స్పోర్టు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రోల్ ఎలా ఉంటుంది? ఈ విభాగాలకు సంబంధించి రిపోర్టులు ఇద్దరు కమిషనర్లకు వెళ్తాయా? ఉద్యోగుల డ్యూటీలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తిగా మారింది.