మణికొండ, జూన్ 27 : గండిపేట చెరువు నీటిని నగరవాసులకు అందించేందుకు నిర్మించిన కాలువ(కాండూట్)కు కాలం చెల్లే రోజులు దగ్గరపడుతున్నాయి. అయితే.. కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ గ్రామాల మీదుగా వెళ్లే గండిపేట కాలువ(కాండూట్) ఈ ప్రాంతాల్లో కాలువకు ఇరువైపులా బహుళ అంతస్తుల భవనాలు నిర్మితమయ్యాయి. కాలువకు వంద అడుగుల దూరం వరకు జీవో 111 అమలులో ఉన్నదని, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులకు తెలుసు. కానీ, బహుళ అంతస్తుల నిర్మాణాలను జీవో పరిధిలో నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుప్పాలగూడ బీఆర్సీ అపార్టుమెంటుకు ఎదురుగా ఓ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణాల రాకపోకల కోసం నిబంధనలకు విరుద్ధంగా కాండూట్పై సిమెంట్ కాంక్రీట్తో రహదారిని చేపట్టి రాకపోకలకు సిద్ధం చేసింది. జలమండలి సూచించిన మేరకు కాండూట్పై కల్వర్టు నిర్మించి దానిపై నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. కానీ, సదరు సంస్థ అవేమీ పట్టనట్లు దర్జాగా కాండూట్పై సిమెంటు పోసి ఆపై టైల్స్ వేసి రహదారిని నిర్మించింది. అంతటితో ఆగకుండా కాండూట్పై మట్టిపోసి వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ కేంద్రాలను సదరు బిల్డర్లు ఏర్పాటు చేశారు.
గతంలో కాలువపై కొన్ని వ్యాపార కేంద్రాలతో పాటు ఇటీవల అపార్టుమెంట్ల రాకపోకలకు కాలువపై రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాలువ కుచించుకుపోవడంతో ఎగువ ప్రాంతాల్లో వేల లీటర్ల తాగునీరు భూమి పాలవుతున్నది. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు జలమండలి అధికారులకు తెలిపినా తాత్కాలిక చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గండిపేట చెరువు నుంచి నగరానికి తరలించే కాలువ(కాండూట్)కు ఇరువైపులా వంద మీటర్ల వరకు జీవో 111 అమల్లో ఉంది. చాలా చోట్ల ఆక్రమణలు చేసిన వారికి ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశాం. కానీ ఇటీవల కొన్నిచోట్ల ఇష్టానుసారంగా కాండూట్పై వ్యాపార కేంద్రాల నిర్వహణపై చర్యలు తీసుకున్నాం. బీఆర్సీ సమీపంలో ఓ అపార్టుమెంటు నిర్మాణదారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా మొండిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఆక్రమణలను త్వరలోనే కూల్చివేస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.