Telangana | ఉస్మానియా యూనివర్సిటీ/ బన్సీలాల్పేట/ మెహిదీపట్నం, జూలై 1 : నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీ దవాఖానలో మోతీలాల్ను పరామర్శించేందుకు వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం.. అక్రమ అరెస్టులకు పాల్పడటంతో వైద్యశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగుల ఆందోళనలు.. నిరసన ర్యాలీలతో ఉస్మానియా వర్సిటీ అట్టుడికింది.
మెయిన్ లైబ్రెరీ నుంచి విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బైఠాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడితే తమను అరెస్టు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది రోజులుగా విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఓయూ వేదికగా వేలాది మందితో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జంగయ్య, కార్తీక్, వినోద్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
బొల్లారం: మోతీలాల్ను పరామర్శించేందుకు గాంధీ వైద్యశాలకు వెళ్లిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేశ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6నెలలు దాటిన నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి పోస్టులు పెంచకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం మేరకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.