మెహిదీపట్నం, జూలై 2: తెలంగాణ ఆషా ఢ మాసం బోనాలు జూలై 7వ తేదీన చారిత్రాత్మక గోల్కొండ కోటలో నెలవైన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలో సన్నాహాలు ప్రారంభించారు. ఆలయానికి బ్రాస్ తాపడం పనులు పూర్తి చేశారు. అంతకు ముందు రంగులు వేసే పనులను కూడా అధికారులు దాదాపుగా పూర్తి చేయించారు. ఇవి కాకుండా ఆలయంలో బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన పనులు మంద కొడిగా సాగుతున్నాయి. బారికేడ్ల ఏర్పాటుకు సోమవారం మధ్యాహ్నం తర్వాత పనులను ప్రారంభించగా, వాటర్ ట్యాంకర్ల, పైపులైన్ల ఏర్పాటు పనులు పత్తా లేవు. జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ముందు షెడ్ వేయాల్సి ఉండగా, ఆ పనులు కూడా ఇంకా చేయలేదు.
గోల్కొండ కోటకు వచ్చే రోడ్లపై ఎక్కడ చూసినా అపరిశుభ్రత వాతావరణంతో పాటు రోడ్ల గుంతలు అలాగే ఉన్నాయి. గోల్కొండ కోట బోనాల పనులను జూలై 5వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వ శాఖల అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. కానీ, ఇప్పటికీ అసలు బోనాల పనులు జరుగుతున్న దాఖలాలు లేవు. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నెల రోజుల పాటు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా తెలంగాణ ఆషాఢ బోనాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. బోనాలు ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే ఉన్నప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేక పోతుంది. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉంటూ బోనాలను విజయవంతంగా నిర్వహిస్తాయా? లేదా? అని గోల్కొండ, లంగర్హౌస్ ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దేవాదాయ శాఖ తప్ప ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, విద్యుత్, జల మండలి, ఎంటమాలజీ, పారిశుద్ధ్య విభాగం అధికారులు పనిచేస్తున్నట్లుగా కనిపించడం లేదు. మంత్రి ఆదేశాలను అధికారులు పాటించడం లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.