Balapur | రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని సర్వేనంబర్ 74లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతుల నుంచి భూమిని (గైరాన్ సర్కారి) సేకరించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఆర్సీఐకి అప్పగించింది. అందుకు గాను దళిత రైతులకు 60 చదరపు గజాల చొప్పున స్థలాలు ఇస్తూ.. పట్టాలు జారీ చేసింది. 1993లో జారీ చేసిన ఈ పట్టాలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులు స్థలాలను అప్పగించలేదు. ఇదేమంటే.. అందుకు సంబంధించిన ఫైళ్లు కనిపించడం లేదంటున్నారు. సాగు చేసే భూమిని కోల్పోయి.. ఇటు ఇంటి స్థలాలూ రాక కేవలం పట్టాలను చూసుకొని మురవాల్సిన దుస్థితి.
బాలాపూర్ సర్వేనంబర్ 74లోని ప్రభుత్వ భూమిలో సాగుతున్న కబ్జాపర్వమిది. బహిరంగంగానే సర్కారు భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తుంటే బాలాపూర్ గ్రామస్తులు తాసీల్దార్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించిందీ లేదు.. అక్రమ నిర్మాణాన్ని ఆపింది లేదు. ఇదేమంటే… సర్వే చేస్తాం.! ఆ తర్వాత ఆక్రమణలు తొలగిస్తామంటున్నారు. అక్రమ నిర్మాణాలు జరిగేదాకా ఆగేది ఎందుకు? ఆ తర్వాత కూల్చి వేతల హైడ్రామా నడిపేదెందుకు? అనేది గ్రామస్తుల ఆరోపణ. ముఖ్యంగా పేదలకు పట్టాలిచ్చిన భూమిలో.. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు.. కబ్జా అవుతున్న భూమిలో మాత్రం బోర్డులు ఏర్పాటు చేసేందుకు సర్వేల సాకు చూపుతున్నారు.
ఇదీ… బాలాపూర్లోని 74 సర్వేనంబర్ కథా కమామీషు. కోట్ల రూపాయల విలువజేసే ప్రభుత్వ భూమి కండ్ల ముందు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై బాలాపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర సర్వే ద్వారా పదెకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా.. అధికారులు తాత్సారం చేయడం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఎందుకు నిర్మాణాలు చేస్తున్నారని తాము అడిగితే… గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను కలవాల్సిందిగా సదరు నిర్మాణం చేపట్టిన వ్యక్తులు చెబుతున్నారని.. అందుకే కాంగ్రెస్ పెద్ద మనుషులే దీని వెనుక సూత్రధారులని తమకు అర్థమైందని అంటున్నారు.
కాగా, ఈ భూమి అన్యాక్రాంతంపై బాలాపూర్ తాసీల్దార్ మాధవీరెడ్డి బుధవారం కూడా పాత సాకునే చూపారు. సర్వే రిపోర్టు రాగానే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సర్వే నంబర్లో ఎక్కడైనా కబ్జాలు అవుతున్నట్లు తెలిస్తే సమగ్ర సర్వే చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణం చేపడుతున్న వారు పక్క సర్వే నంబర్ వారు అయినందున కొంత సమయం ఇస్తున్నామని, సర్వేలో వచ్చిన రిపోర్టు ఆధారంగా నిర్మాణాలు ఉన్నట్లయితే తొలగించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. – బడంగ్పేట్, జూలై 3