హైదరాబాద్: పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగానే దేశం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఆయన ఒక చరిత్ర అని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి.. ప్రధానిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్ల దేశం నేడు అభివృద్ధి పథంలో పయణిస్తున్నదని చెప్పారు.
పీవీ ఖ్యాతిని గుర్తించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీవీకి దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చిందని వెల్లడించారు. పీవీ చరిత్రను నేటి యువత చదువుకోవాలని సూచించారు. ప్రధానిగా నాడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు ప్రభుత్వాల పాలన ముందుకు సాగుతున్నదని వెల్లడించారు.
దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి: కేటీఆర్
దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీవీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. హస్తినలో ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మొదటి దక్షిణ భారత నాయకులు పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పీవీ అని ప్రశంసించారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపిన వ్యక్తి మన పీవీ. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావును దేశం ఎన్నటికీ మరిచిపోదు. భూసంస్కరణల్లో భాగంగా 8 వందల ఎకరాల భూమిని సర్కార్కు అప్పగించిన గొప్ప నాయకుడు పీవీ. విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడు పీవీ. పీవీ నరసింహారావుకు భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. భారతదేశాన్ని ప్రపంచపటంలో ఉన్నతంగా నిలిపారు పీవీ. నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు నామకరణం చేశాం. అక్కడే ఆయన విగ్రహం ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు.