హిమాయత్నగర్,జూన్ 28: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం నారాయణగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్, అడ్మిన్ ఎస్సై నరేశ్కుమార్తో కలిసి సుల్తాన్బజార్ ఏసీపీ శంకర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బొగ్గులకుంటకు చెందిన బాలిక(14) హైదర్గూడలోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. ఆగాపురాకు చెందిన షేక్ అర్బాస్(23) బైక్ మెకానిక్. కొద్ది రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో షేక్ అర్బాస్కు బాధిత బాలికతో పరిచయం ఏర్పడింది. నిత్యం బాలికతో ఆ యువకుడు చాటింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతూ వేధించాడు. ఈ నెల 24న బాలిక స్కూల్కు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని స్కూల్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. బాలిక ఓ యువకుడి బైక్పై వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ బైక్ నంబర్ ఆధారంగా షేక్ అర్బాస్ తీసుకువెళ్లినట్లు పోలీసులు నిర్ధారించి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి.. గుల్బర్గాలో ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడు షేక్ అర్బాస్ భయంతో బాలికను నగరానికి తీసుకొచ్చి, తిరిగి అతడు పారిపోయేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నాంపల్లిలో షేక్ అర్బాస్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు. బాలికను పోలీసులు భరోసా సెంటర్కు తరలించి, వాంగ్మూలం రికార్డు చేయగా.. గుల్బర్గాలోని ఓ లాడ్జీకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై నరేశ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.