మియాపూర్, జూలై 3 : మియాపూర్ పరిధిలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న యువతిపై తోటి ఉద్యోగులే లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్నది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి(24) ఉప్పల్లో నివాసముంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ విభాగంలో ట్రైనీగా ఇటీవలే ఉద్యోగంలో చేరింది. కాగా, అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పని చేస్తున్న సంగారెడ్డి , జనార్దన్లు సైట్ విజిట్ పేరుతో సదరు యువతిని జూన్ 30 మధ్యాహ్నం 12 గంటల సమయంలో మియాపూర్లోని ఓ హాస్టల్ నుంచి కారులో తమ వెంట యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. సమావేశం పూర్తయిన అనంతరం రాత్రి 9 గంటల సమయంలో యువతితో కలిసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. 10.30 గంటల సమయంలో ఓ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కారు మరమ్మతుకు గురైందంటూ నిలిపేశారు. ఏదైనా తినాలని యువతిని అడగ్గా ఆమె తిరస్కరించింది.
కనీసం కూల్ డ్రింక్ తాగమంటూ, స్వీట్ తినమంటూ ఇచ్చారు. అప్పటికే వాటిలో మత్తు మందు కలిపి యువతికి ఇచ్చారు. వాటిని తీసుకున్న అనంతరం సదరు యువతి మత్తులోకి జారుకుంది. యువతిని వివస్త్రను చేసి ఇరువురు లైంగికంగా వేధించి, తీవ్రంగా కొట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సదరు యువతిని శ్రీలక్ష్మీ హాస్టల్ వద్ద సంగారెడ్డి, జనార్దన్లు వదిలి వెళ్లారు. తనపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు. నిందితులు సంగారెడ్డి, జనార్దన్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగినిపై సహచర ఉద్యోగులే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. సైట్ విజిట్ పేరిట పెద్ద సంఖ్యలో వినియోగదారులను సైతం సదరు కంపెనీ ఉద్యోగులు దూర ప్రాంతానికి తీసుకెళుతుంటారు. వారిపైనా ఇలాంటి ఘాతుకాలకు ఏమైనా పాల్పడ్డారా.? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.