శామీర్పేట, జూలై 2: కూరగాయల కోసం వాడే ట్రేలను అడ్డం పెట్టి సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వారిని మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన నల్ల మల్లేశ్ టీఎస్08టీ 6999 నంబర్ గల వాహనంలో సూర్యాపేట నుంచి పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి తరలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం రాజీవ్ రహదారిపై శామీర్పేట వద్ద వాహనాన్ని తనిఖీ చేశారు. విత్తనాల సంచులను గుర్తించకుండా ఉండేందుకు కూరగాయాలు తరలించే ఖాళీ ట్రేలను అడ్డుగా పెట్టారు. ఈ సంచులను తెరిస్తే అందులో నకిలీ పత్తి విత్తనాలు కనిపించాయి. దీంతో డ్రైవర్ మల్లేశ్ను అదుపులోకి తీసుకుని 800ల కిలో నకిలి పత్తి విత్తనాలు, ఒక సెల్ ఫోన్, డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
నిందితులపై బీఎన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్టుల క్రింద కేసు నమోదు చేశారు. వాహన యజమాని అయిన రాజును కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. కాగా నకిలీ విత్తనాలు ఎవరైనా రవాణా చేస్తున్నట్లు తెలిస్తే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులను మోసం చేద్దామనో లేదా తక్కువ ధరకు వస్తున్నాయనో నకిలీ విత్తనాలను ప్రోత్సహిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని కోటిరెడ్డి హెచ్చరించారు. కాగా, నకిలీ విత్తనాల పట్టివేతకు కృషి చేసిన పేట్బషీర్బాగ్ ఏసీపీ రాములు, శామీర్పేట సీఐ శ్రీనాథ్, ఎస్వోటీ సీఐ రమేశ్లకు రివార్డులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ రాములు, సీఐ శ్రీనాథ్, వ్యవసాయ అధికారి రమేశ్, ఎస్ఐలు మునీందర్, హారిక, అనిత, ఏఎస్ఐ రమేశ్గౌడ్ పాల్గొన్నారు.