సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం చాంబర్లో ఆమె జోనల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికతో పాటు సంబంధిత ఫొటోలు కూడా పంపించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఒక్కొక్క అంశంపై ప్రజలకు వివరించాలన్నారు. డెంగీ నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సంబంధిత ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, రవికిరణ్, ఉపేందర్రెడ్డి, పంకజ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి
జీవీపీల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ ఆమ్రపాలి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి.. శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. కూకట్పల్లి, మూసాపేట, భరత్నగర్, రైతుబజార్ ప్రాంతాల్లో పర్యటించి.. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు జోనల్ కమిషనర్లు వారి ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్లు శానిటేషన్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు.