నేరేడ్మెట్, జూన్ 30: బాలికపై లైంగికదాడి కేసులో 10మంది నిందితులను ఆదివారం నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనోపాధిపొందుతున్న ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె (12)కు నేరేడ్మెట్, వినాయకనగర్కు చెందిన చక్కొల్ల నరేశ్ (26), సిరిపంగ విజయ్కుమార్ (23)లు మత్తుమందు అలవాటు చేశారు. ఈక్రమంలో పలుమార్లు బాలికను వినాయకనగర్కు తీసుకొచ్చి కూల్డ్రింగ్లో మత్తుమందు కలిపి తాగిపించి 8మంది మిత్రులతో కలిసి వారు లైంగి కదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికాగా తల్లి దవాఖానకు తీసుకువెళ్లగా.. గర్భవతి అని తేలింది.
వెంటనే బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి.. నిందితులు నరేశ్,విజయ్కుమార్, దినకర్నగర్కు చెందిన బాలి (23), దీపక్ (25), సింహాద్రినగర్కు చెందిన కృష్ణ (22), వినాయకనగర్కు చెందిన కిరణ్ (26), ఓల్డ్ సఫిల్గూడకు చెందిన అజయ్ (23), సాయినాథ్పురంకు చెందిన జేమ్స్ (24), ఈస్ట్ ఆనంద్బాగ్కు చెందిన మధు (30), ఆర్టీసీ కాలనీకి చెందిన బాలు (25)లను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో 7మంది నిందితులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు.