సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ ) : నాగార్జున సాగర్ నుంచి నగరానికి రెండో దశ కృష్ణా జలాల( Krishna water) తరలింపులో భాగంగా కోదండపూర్ పంప్హౌజ్లో మరమ్మత్తులకు గురైన రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ పనులు గురువారం ఉదయం వరకు పూర్తయ్యాయని జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం అధికారులు ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ..నీటి సరఫరాను పునరు ద్ధరించినట్లు (Restoration )పేర్కొన్నారు. కృష్ణా డ్రింకింగ్ సఫ్లయి ఫేజ్-2 పరిధిలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, హైదరాబాద్ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీం ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్హౌజ్లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి నెలకొందని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉండడంతో పలు ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. మరమ్మతు పనులు వేగంగా చేపట్టడంతో నీటి సరఫరాలో అంతరాయం తొలగినట్లయింది.