సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా(EVDM Commissioner) సీనియర్ ఐపీఎస్(ఐజీ) ఎవి రంగనాథ్(Ranganath )బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిష నర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్ఛాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగ బాధ్యతలను ఎప్పటిలాగానే విజయవంతంగా కొనసాగించాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కాగా, అసెర్ట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ విభాగం సేవలందించనుంది. రంగనాథ్ సారథ్యంలో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్సీలను పోలీస్ విభాగం నుంచి డిప్యూటేషన్పై తీసుకోనున్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణలో ఈ విభాగం కీలకం కానున్నది. గతంలో వివిధ శాఖలను సమర్ధవంతంగా చేపట్టిన రంగనాధ్ ఈవీడీఎం కమిషనర్గా మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు.