రోగికి అత్యవసర సమయంలో వైద్యసేవలు అందించేందుకు సైరన్ను వాడుతూ.. అంబులెన్స్లు వేగంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు సైతం రూట్ క్లియర్ ఇస్తుంటారు. అయితే ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో చాలా సందర్భాల్లో అత్యవసర సమయం కానప్పుడు కూడా అంబులెన్స్ డ్రైవర్లు.. సైరన్లు వాడుతూ.. వెళ్తున్నట్లు గుర్తించారు. చికిత్స అనంతరం రోగిని ఇంటికి తీసుకెళ్లే సమయంలో.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు.. ఉద్యోగులు.. వివిధ రకాల శాంపిళ్ల కలెక్షన్లు.. మృతదేహాలను తరలించేటప్పుడు.. ఇలా అంబులెన్స్ డ్రైవర్లు సైరన్ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. అత్యవసర సమయాల్లోనే సైరన్ను వాడాలని.. దుర్వినియోగం చేయవద్దని డ్రైవర్లకు నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తేతెలంగాణ)
Ambulance | ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ సర్వీస్లకు సంబంధించిన సైరన్ను ఎలా వాడుతున్నారు..దాని దుర్వినియోగంపై ఒక సర్వే చేశారు. ఇందుకు గత నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల వద్ద 310 అంబులెన్స్ సేవల గురించి ఆరా తీశారు. అందులో అత్యధికంగా 152 అంబులెన్స్లు (49%) శాంపిళ్లను తీసుకొని వెళ్తున్నవే ఉన్నాయి.. అలాగే వివిధ కారణాలు చెప్పినవి 121 (39%), మృతదేహాలను తీసుకెళ్తున్నవి 20 (6.5%), ఖాళీగా వెళ్తున్నవి 17 (5.5%) ఉన్నట్లు తేలింది. ఇలా సగానికిపైగా అంబులెన్స్ల సైరన్లు దుర్వినియోగం అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
రోగికి అత్యవసరంగా వైద్యసేవలు అందించేందుకు సైరన్ను వాడుతూ.. అందరి సహకారంతో అంబులెన్స్లు వేగంగా వెళ్లాల్సిన అవసరముంటుంది. అయితే ఆ రోగికి అత్యవసరం కాకున్నా..అంబులెన్స్ ఉందంటే సైరన్ వేసుకొని వెళ్లేవారు చాలా మంది ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు.. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. అప్పుడే పుట్టిన పసిపాపలు.. ఇలా కొన్ని సందర్భాల్లో తప్పని సరిగా అంబులెన్స్ సైరన్ వాడాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. రోగి చికిత్స అనంతరం అంబులెన్స్లో ఇంటికి వెళ్తుండడం, మృతదేహాలను తరలించడం, అనారోగ్యంగా ఉన్న వారిని, ఉద్యోగులు, వివిధ రకాలైన శాంపిళ్లను తీసికెళ్లే సమయంలోనూ అంబులెన్స్ సైరన్ను దుర్వినియోగం చేయవద్దని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ సూచనలు చేస్తున్నారు.
అంబులెన్స్ సైరన్తో వెళ్తుంటే.. రోడ్డుపై వెళ్లే వాహనదారులతో పాటు జంక్షన్ల వద్ద పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తుంటారు. ఆటోమెటిక్ వ్యవస్థ ఉన్న చోట ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు సిగ్నళ్లను మాన్యువల్గా మార్చేసి అంబులెన్స్లకు దారిస్తుంటారు. ఇలా ఒక గంటలో ఒక జంక్షన్ నుంచి 5 నుంచి 6 అంబులెన్స్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో ఆటోమెటిక్ నుంచి మాన్యువల్ మోడ్కు సిగ్నల్ వ్యవస్థను మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంబులెన్స్లు నాన్ ఎమర్జెన్సీ సందర్భాల్లోనూ సైరన్ మోగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు సర్వే ద్వారా గుర్తించారు.
అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా ఇటీవల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హాస్పిటళ్ల యాజమాన్యాలు, ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్స్, అంబులెన్స్లు కలిగి ఉన్న డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ యాజమాన్యాలతో నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు సీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. అంబులెన్స్ సైరన్ను దుర్వినియోగం చేయవద్దని, అత్యవసర పరిస్థితులు, అత్యవసరం కాని పరిస్థితులను వేర్వేరుగా చూడాలని సూచించారు. ఇందుకు స్వీయ నియంత్రణ అవసరమని అంబులెన్స్ డ్రైవర్లు, దవాఖానల యాజమాన్యాలకు సూచించారు. ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను తయారు చేస్తున్నామని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.