సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే.. అదే సమయంలో తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో విద్యుత్ అంతరాయాలు నిత్యకృత్యం అన్నట్లు మారాయి. తాజాగా శుక్రవారం సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని మీర్పేట టీచర్స్ కాలనీలో గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హబ్సిగూడ సర్కిల్ పరిధిలోని 11 కేవీ వెంకటసాయి నగర్ ఫీడర్ పరిధిలోనూ సరఫరా నిలిచిపోగా, సికింద్రాబాద్ సర్కిల్లోని 11కేవీ అంజయ్య నగర్లో ఫీడర్లోనూ అంతరాయం ఏర్పడింది. ఇలా 9 సర్కిళ్లలో ఏదో ఒక ఫీడర్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. సరఫరా పునరుద్ధరణకు అర గంట నుంచి గంట సమయం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఏ మాత్రం వర్షం కురిసినా.. కరెంటు పోతోందని, విద్యుత్ శాఖ అధికారులు లైన్లలో మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్లే తరచూ కరెంటు పోతోందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.