సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ):ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు కారిడార్లను ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతో కలిపే ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. నగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమై ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తామని చెప్పిన ప్రాజెక్టులను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) పూర్తిగా పక్కన పెట్టేసింది. అందుకు ప్రత్యేక నిదర్శనం… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తూర్పు వైపు కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో ఒక మెట్రో స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్ ఉంటే, పడమర వైపు కారిడార్-2( జేబీఎస్- ఎంజీబీఎస్)లో సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
ఈ రెండు మెట్రో స్టేషన్లను సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్తో కలిపే ఒక స్కై వాక్ నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున మెట్రో అధికారులు సర్వే చేసి, డిజైన్లు రూపొందించినా ఇప్పటికీ నిర్మాణం చేపట్టలేదు. రెండు మెట్రో కారిడార్ల నుంచి వచ్చే మెట్రో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే.. ట్రాఫిక్ ఇబ్బందులు ఒకవైపు, స్టేషన్ దిగిన తర్వాత సామగ్రి ఎక్కువగా ఉంటే ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే స్కైవాక్ నిర్మించి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు. ఇలా ఒక్క చోటే కాదు… మూడు మెట్రో కారిడార్లలో ఉండే నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రత్యేకంగా మెట్రో షటిల్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
నేటి నుంచి..
నగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు మంగళవారం నుంచి ఉదయం 5.30 గంటల నుంచే మొదలుకానున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న సమయాలను పొడిగించాలని నగర వాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం ఐటీ ఉద్యోగులు మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తుండటంతో ప్రయోగాత్మకంగా శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైలును నడిపారు. ఆ సమయంలో ప్రయాణికుల ఆదరణ ఉండటంతో ఇక నుంచి మూడు కారిడార్లలో టర్మినల్ స్టేషన్ల నుంచి ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచే సర్వీసులు నడుస్తాయని అధికారులు చెప్పారు.