Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలోని వాహనాల పార్కింగ్ ఫీజుల విషయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్ర స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై ఎల్అండ్టీ మెట్రో వెనక్కి తగ్గింది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే వరకు అమలును వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈనెల 25 నుంచి నాగోల్లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లాట్లలో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ‘పెయిడ్ పార్కింగ్’ రద్దు చేయకపోతే నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మహాధర్నా చేస్తామని ప్రయాణికులు హెచ్చరించడంతో ఎల్అండ్టీ దిగివచ్చింది. ఇప్పటికే కారిడార్-1 (ఎల్బీనగర్-మియాపూర్), కారిడార్-3 (నాగోల్- రాయదుర్గం) మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రద్దీ సమయాల్లో కోచ్లలో స్థలం ఉండటం లేదంటూ చాలా కాలంగా చెబుతున్నా.. మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే అనేకసార్లు ప్రయాణికులు మెట్రో అధికారులకు, ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆ సమస్య అలా ఉండగానే.. కొత్తగా నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ లాట్లలో ఒకేసారి భారీ ఎత్తున పెయిడ్ పార్కింగ్ ఫీజులను నిర్ణయించి, అమలు చేస్తామని ప్రకటించడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ఈనెల 14న మెట్రోస్టేషన్లో నిరసన తెలిపారు.
మెట్రో రైళ్లలో అధికంగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులే రాకపోకలు సాగిస్తున్నారు. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లాలంటే ప్రతి రోజూ రానుపోను రూ. 120 వరకు మెట్రో చార్జీ అవుతుండగా, కార్ పార్కింగ్ చేస్తే మరో రూ. 120, మెట్రోస్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లేవరకు మరో రూ. 30-40ల దాకా ఖర్చవుతున్నది. ఇలా ఒక్క రోజు రవాణా చార్జీలే రూ. 270 నుంచి రూ.300 ల దాకా అవుతున్నది.
ఇంటి నుంచి మెట్రోస్టేషన్.. అటు నుంచి పనిచేసే కార్యాలయాల వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడంతో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది తమకు భారంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి.. రైలులో ఆఫీసుకు వెళ్లి రావడానికి కనీసం 9 గంటల పైనే పడుతున్నది. ఇదిలా ఉంటే 8 గంటల పార్కింగ్కు కార్లకు ఫీజు 120 రూపాయలు నిర్ణయించడాన్ని ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మెట్రో స్టేషన్లలోనే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తాజాగా ఎల్అండ్టీ పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.