సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్ అంటేనే ఆధునికతకు మారుపేరు. అలాంటి కారిడార్లో ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు హెచ్ఎండీఏ యంత్రాంగం. గచ్చిబౌలి నుంచి నానక్రాంగూడ మీదుగా నార్సింగి, మంచిరేవుల వరకు ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు డంప్ యార్డుగా మారుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లో భవన నిర్మాణాలు జోరుగా జరుగుతుండటంతో అక్కడి వ్యర్థాలను తీసుకొచ్చి సర్వీసు రోడ్ల వెంబడి ఉన్న ఖాళీ ప్రాంతాల్లో పడేస్తున్నా.. అడిగే వారే ఉండటం లేదు. గ్రేటర్ చుట్టూ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డును సమర్థవంతంగా నిర్వహించాల్సిన అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రోడ్డు నిర్వహణను చూడాల్సిన అధికార యంత్రాంగం ఆఫీసులకే పరిమితమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో రోడ్లను పరిశీలిస్తూ ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులు అటు వైపే కన్నెత్తి చూడటం లేదు.
రాత్రి వేళల్లో డంపింగ్…
ఔటర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు వెంబడి మొక్కలు నాటి సంరక్షించాల్సిన అధికారులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఓఆర్ఆర్ నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి పనులు చేపట్టడం లేదు. రాత్రి వేళల్లో భారీ నిర్మాణ సైట్ల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పారబోస్తున్నారు. అదే సమయంలో మట్టి, కంకరతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లపై పడుతోంది. ఈ క్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మట్టి ఎక్కువగా పడి.. దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లపై వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా హెచ్ఎండీఏ అధికారులు స్పందించి భవన నిర్మాణ వ్యర్థాలను సర్వీసు రోడ్ల వెంట వేయకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.