Veterinary Hospital | హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద పశువైద్యశాలగా గుర్తింపు పొందిన మా సరస్వతి పశువైద్యశాల హైదరాబాద్లోనూ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించనుంది. సత్యం శివం సుందరం గో శాలలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 5100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, డయాగ్నోస్టిక్స్, వైద్య సదుపాయాలతో గగన్పహాడ్లోని గో శాలలో ప్రారంభించనున్నారు. పశు వైద్య నిఫుణులు, సర్జన్లు, పారా మెడికల్ సిబ్బందితో గగన్పహాడ్లో ఫెసిలిటీ సెంటర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
నగరానికి చెందిన జ్యువెలరీ వ్యాపారి ధరమ్ రాజ్ రంఖా(85) గడిచిన 30 ఏళ్లుగా గగన్పహాడ్లో 3200 ఆవులు, బురుజుగడ్డలో మరో 2800 ఆవులకు గోశాలను నిర్మించి సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో వాటి సంరక్షణతోపాటు మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే చిరకాల ఆకాంక్షతో ఈ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. కేవలం ఆవులు, గేదేలు మాత్రమే కాకుండా గొర్రెలు, మేకలు, కుక్కలను కూడా సంరక్షించి వాటికి పునరావాసం కల్పిస్తున్నట్లుగా నిర్వహకులు పేర్కొన్నారు.