హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు.
గ్రేటర్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నారు. నీటి తొలగింపునకు ప్రత్యేకంగా 128 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగాయి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇక డీఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి నిల్వలపై 995 ఫిర్యాదులు, 118 చోట్ల చెట్లు పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 040- 21111111గానీ, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిషారం చూపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.