సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గత ఏప్రిల్ నెల నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఫుడ్సేఫ్టీ, టాస్క్ఫోర్స్ కలిపి జీహెచ్ఎంసీ పరిధిలో 104, జీహెచ్ఎంసీ అవతల 25 కలిపి మొత్తం 129 చోట్ల తనిఖీలు చేపట్టారు. వంటగది అపరిశుభ్రత మొదలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన మాంసం, పురుగులు పట్టిన బిర్యానీ వంటివి అందిస్తున్న 90 మంది వ్యాపారస్తులకు జరిమానాలతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ 30 మందికి హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.
మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ విభాగం అధికారులు కల్తీరాయుళ్ల భరతం పట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండున్నర నెలలుగా నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్లపై చర్యలు తీసుకున్నారు. దాదాపు 120కు పైగా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటే..అందులో అత్యధికంగా పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు 040- 2111 1111లో సంప్రదించాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారి బాలాజీ సూచించారు.
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంట గదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్లో పెట్టి దానికి మసాలాలు దట్టించి.. మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్లు ఉంటున్నాయి. జీహెచ్ఎంసీకి నిత్యం 100కు వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి.