బేగంపేట్, జూన్ 30: ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ బోనాలు – జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా జూలై 9న జరిగే బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, 21, 22న జరిగే సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే విధంగా అధికారులకు పరస్పర సహకారం అందిస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, గత ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను చేపట్టకుండా ప్రజా సమస్యల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆషాఢ మాసం అనంతరం, పాదయాత్రకు రూప కల్పన చేస్తామని తెలిపారు. సమస్యలపై ప్రజా క్షేత్రంలో పోరాడుదామని పిలుపునిచ్చారు.
తన సోదరుడు శంకర్ యాదవ్ మరణ విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శంకర్ యాదవ్తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికి తెలిసిందేనన్నారు. తన కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్నదని ఆ కారణంగానే రాజకీయ పరమైన కార్యకలాపాలలో పాల్గొనలేక పోతున్నట్టు వివరించారు. కానీ, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అయోమయానికి గురి కావొద్దని కోరారు. ఈ క్రమంలో శంకర్ యాదవ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలను లక్ష్మి, హేమలత, మాజీ కార్పొరేటర్లు శేషు కుమారి, డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేశం రాజు, లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, గులాబ్ సింగ్, ప్రేమ్ కుమార్, కిశోర్ కుమార్, ఆంజనేయులు, అఖిల్, శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.