మల్కాజిగిరి, జూన్ 28: ఇందిరాగాంధీ చౌరస్తాను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ ఇందిరాగాంధీ చౌరస్తాను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే ధర్నా చేశారు. ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు ప్రకాశ్రెడ్డి, మహేశ్, శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజేందర్తో కలిసి చౌరస్తాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చౌరస్తా అభివృద్ధి కోసం కేసీఆర్ నిధులు మంజూరు చేశారన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చౌరస్తాను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చౌరస్తా అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్, రమేశ్, పుదారి రాజేశ్కన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.