కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 2 : వీధి కుక్కలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన 24 మంది బాధితులను శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీ, బస్తీల్లో వీధి కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటి నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. నగరంలో ఇటీవల వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కుక్కల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పక్కాగా చేయాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను సవర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల కూడా వీధి కుక్కల నియంత్రణకు సహకరించాలని, ఆహార పదార్థాలను రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో వేయవద్దని, స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలని కోరారు.