హైదరాబాద్: శంషాబాద్లో చిరుతపులి (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టిస్తున్నది. గతంలో విమానాశ్రయం వద్ద ఓ చిరుతపులిని పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడలో చిరుత కనిపించింది. సోమవారం అర్ధరాత్రి సీసీ టీవీలో రికార్డయిన వీడియలో కనిపించిన దానిని చిరుతగా అటవీ అధికారులు భావిస్తున్నారు. దాన్ని బంధించేందుకు మూడు బోన్లతో పాటు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, ఇటీవల అదే జంతువు కుక్కపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
గత నెల ఆరంభంలో శంషాబాద్ విమానశ్రయంలో చిరుత పులి సంచరించింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్పోర్ట్ ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతోపాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. విమానాశ్రయం ప్రహరీ దూకుతుండగా పెన్సింగ్ వైర్లకు చిరుత తగలింది. దీంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. ఆ తర్వాత రెండు రోజులపాటు శ్రమించిన అటవీ అధికారులు చిరుతను పట్టుకున్నారు.