MLA Danam Nagendar | ఖైరతాబాద్ బడా గణేశ్ మండపం రాజకీయాలకు వేదికగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. జూన్ 17న కర్రపూజతో మొదలైన డ్రామా విగ్రహ నిర్మాణ ప్రారంభం, నమూనా విడుదల వరకు హైడ్రామాగా మారింది. కర్రపూజ ముందే వైరుధ్యాలు నెలకొనగా, ఉత్సవ కమిటీలోని మరో వర్గం వేరే కుంపటి పెట్టుకున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, పలువురు నేతల జోక్యంతో ఈ గొడవకు కాస్త రాజకీయ రంగు పులుముకున్నది. ఒకానొక దశలో ఎమ్మెల్యే ముందే ఇరువర్గాలు కొట్టుకునేంత పనిచేశాయి. చివరకు అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పడంతో పై పైకి ఓకే అన్నా.. అంతర్గతంగా వైరుధ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
వాస్తవానికి 1954 నుంచి సింగరి కుటుంబమే వారసత్వంగా మహాగణపతి బాధ్యతలను స్థానిక బస్తీ వాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ వస్తోంది. కొందరు అసంతృప్త సభ్యులు తమకు సరైన ప్రాధాన్యతనివ్వడం లేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా ఆవిష్కరణ సైతం రాజకీయాలకు వేదికగా మారిందంటున్నారు. గురువారమే విగ్రహ నమూనాను ఆవిష్కరిస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించగా, ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం 1.30 గంటలకు పెట్టుకోవాలని..తాను వచ్చి ఆవిష్కరణ చేస్తానని చెప్పారు.
దీంతో సరేనన్న కమిటీ.. అందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. చెప్పిన సమయానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ రావాల్సి ఉండగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాలేదు. ఎమ్మెల్యే రాక కోసం సుమారు తొమ్మిది గంటల పాటు నమూనాను ఆవిష్కరించకుండా ఉంచడంతో లైవ్ కవరేజీ కోసం పెద్ద ఎత్తున వచ్చిన మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సుమారు తొమ్మిది గంటల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ విగ్రహ నమూనా విడుదల చేయడంతో ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అయితే ఎమ్మెల్యే కోసం తొమ్మిది గంటల పాటు కార్యక్రమాన్ని నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.